కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా

సికింద్రాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో సిక్ విలేజ్ లోని ఇంపీరీయల్ గార్డెన్స్ లో మేధావుల సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రకాష్ జవడేకర్, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, పార్టీ నేతలు డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి, రామచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు పాల్గోన్నారు. వివిధ వర్గాలకు చెందిన మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమిత్ షా మాట్లాడుతూ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి.. కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదు. బిజెపి మాత్రమే సిద్దాంతానికి అనుగుణంగా నడుస్తుంది. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. తెలంగాణలో పదేళ్ళు అవినీతిలో మునిగిపోయిన బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దు. రానున్న ఐదేళ్ళు మంచి పాలన ఎవరు ఇవ్వగలరో తెలంగాణ సమాజం ఆలోచించాలి.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలు. కుటుంబ, అవినీతి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను పక్కన కూర్చోపెట్టుకోబోమని అన్నారు. మజ్లిస్ తో కలసి ప్రభుత్వాన్ని నడుపుతోన్న కేసీఆర్ ను బిజెపి దగ్గరకు రానివ్వదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకేగూటి పక్షులు. కేసీఆర్ చెప్పిన నీళ్ళు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ప్రజలు తమ ఓటును ఈసారి భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులు అవినీతి మయంగా మార్చిన్రు. తొమ్మిదేళ్ళల్లో తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 9 లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. కేసీఆర్.. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికే పనిచేస్తున్నారు. కుటుంబ పార్టీలు తెలంగాణకు అవసరం లేదు. కేసీఆర్ పార్టీ మజ్లిస్ తో కలసి ప్రభుత్వాన్ని నడపటం సిగ్గుచేటు. బిజెపి తెలంగాణలో అధికారికంలోకి రాగానే గ్రామగ్రామాన తెలంగాణ విమోచన దినోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తాం. భారతీయ జనతా పార్టీకి అవకాశమిస్తే.. తెలంగాణను అభివృద్ధిలో ముందుంచుతామని అన్నారు.



