కాంగ్రెస్ పార్టీని నమ్మినోళ్ల గొంతు కోస్తున్న మంథని ఎమ్మెల్యే
– ముఖం చెల్లకనే బీఆర్ఎస్ పార్టీ వాళ్లను ఏకగ్రీవం చేశారు
– కాంగ్రెస్లో ఉండే నాయకులు ఇప్పటికైనా ఆలోచన చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
Manthani MLA is cutting the throats of people who believe in the Congress party.
మంథని
ఇరువై ముప్పై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకుల గొంతు కోసిన చరిత్ర మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పుట్ట మధూకర్ మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్కు ప్రజల్లో నమ్మకం విశ్వాసం కోల్పోయినట్లు కన్పిస్తోందని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ పెద్ద మోసగాడు ఐస్ గడ్డతో చంపేస్తడని చెప్పితే పెడచెవిన పెట్టే ఈ సమాజం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకుంటలేరని ఆయన అన్నారు. ఇందుకు ఈసారి జరిగే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే నిలువెత్తు నిదర్శన్నామన్నారు. మూడోసారి మంత్రిగా 40ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం వాళ్లు పెట్టిన క్యాండేట్లు గెలుస్తలేరని నిర్ణయం అయి నమ్మినోళ్ల గోంతులు కోశాడని ఆయన అన్నారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి మంథనిలో నిర్వహించిన ర్యాలీలో గొప్ప గొప్ప శ్లోకాలు చదివాడని, ఈసారి జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తాము చెప్పిన వారు మాత్రమే ఊరికి ఒక్కరే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఉంటారని, గతంలో ఊరికి ఇద్దరు ముగ్గురు నిలబడితే బీఆర్ఎస్ వాళ్లు గెలిచారని, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదని నమ్మించి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాట తప్పాడని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఈసారి ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కోల్పోయామని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ 30ఏండ్లుగా పార్టీ జెండా మోసిన నాయకులను పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువా కప్పి ఏకగ్రీవం చేశాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంప్రమైజ్ చేసి మా పార్టీ మెంబర్ షిప్ ఉన్నవాళ్లకు అవకాశం కల్పించడంలో మంథని ఎమ్మెల్యే నీతిని ఆ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. మైదుపల్లిలో పంతంగి లక్ష్మన్, చందనాపూర్లో కొండ శ్రీను, మహాదేవ్పూర్లో జువ్యాజి తిరుపతిలకు కండువా కప్పి కాంగ్రెస్ నాయకులను మోసం చేశాడన్నారు. చందనాపూర్లో బాబుమియా అనే నాయకులు అనేక ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ వేరే పార్టీ నాయకులతో కనీసం మాట్లాడడని, అలాంటి నాయకుడిని మోసం చేశాడని వాపోయారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే ఎలా మోసం చేస్తాడో గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ బానిసలుగా ఉంటరు కాబట్టే వాళ్లకు అర్థం కాదని విమర్శించారు. మంథని ఎమ్మెల్యే గొప్పవాడిగా తెలివితక్కువ ఉన్న మేధావులు కీర్తిస్తా ఉంటారని ఆయన అన్నారు. మంథని ఎమ్మెల్యేకు ప్రజల్లో ముఖం చెల్లి ఉంటే మా పార్టీ వాళ్లను తీసుకుని కండువా ఎందుకు కప్పాడో కాంగ్రెస్ నాయకులకే సమాధానం చెప్పాలన్నారు. మహదేవ్పూర్లో మొన్న రాత్రి గుడాల అరుణ అని ప్రకటించి మళ్లీ మరుసటి రోజున హసీనాబాను అని ప్రకటించారని, ఇలాంటి మోసాలపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపవాసం ఉండి సద్దులు తెచ్చుకుని ఆ కుటుంబం కోసం పని చేసిన వాళ్ల గొంతు కోస్తున్నారని, దుద్దిళ్ల శ్రీధర్ను గొప్పగా అనే మూర్ఢులు ఇప్పటికైనా ఆలోచన చేయాలని హితవు పలికారు. అలాగే గాజులపల్లి, ఎగ్లాస్పూర్లాంటి అనేక గ్రామాల్లో ఇద్దరు ముగ్గురిని బరిలో నిలిపారని, పార్టీ రూల్స్ దాటితే చర్యలు అని ప్రకటన చేసిన మంత్రి ఇప్పటి వరకు ఎవరినైనా సస్పెండ్ చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని, రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా తీసుకువచ్చిన తమకు వాళ్ల నీతి వ్యవహరశైలి పూర్తిగా తెలుసునని, దగ్గరుండి చూశాం అనుభవించాం కనుకనే పదేపదే చెప్తున్నామని అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తగరం శంకర్ లాల్, ఆరేపల్లి కుమార్, కాయితి సమ్మయ్య,పుప్పాల తిరుపతి,మాచిడి సత్యనారాయణ గౌడ్, ఆసిఫ్ ఖాన్, ఇర్ఫాన్, పోలు కనకరాజు, మబ్బు నాగరాజు, జంజర్ల మురళి,సంతోష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.



