హైదరాబాద్, నవంబర్ 14, (వాయిస్ టుడే ): లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారం రూపొందిన సినిమా ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది.అక్టోబర్ 6న ‘800’ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ‘800’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘జియో సినిమా’ ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలు కానుందని ఈ రోజు ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ సింహళ భాషల్లో ‘800’ డిజిటల్ రిలీజ్ కానుంది. థియేటర్లలో సినిమా విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే… ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్లకు రాలేదు. ఆ కారణంగా జియో ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. 800′ సినిమాలో మురళీధరన్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ , మురళీధరన్ భార్య మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ‘అఖండ’, ‘స్కంద’ సినిమాల ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్ర చేశారు.