ఎపిలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాంక్లేవ్ కు అవకాశం కల్పించండి
Provide opportunity for Education Ministers Conclave in AP
పిఎం శ్రీ పథకంలో మరో 1514 పాఠశాలలకు అవకాశం ఇవ్వండి
పూర్వోదయ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు చేయండి
కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి
న్యూడిల్లీ:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం (All India Education Ministers’ Conclave) ను ఎపిలో ఏర్పాటుచేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేటాయించిన వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఎపిలో విద్యావ్యవస్థ కుంటుపడింది. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్దఎత్తున బకాయిలు ఉన్నాయి. కెజిబివిలు, నైపుణ్య విద్య, ICT ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఎపికి నిధుల కేటాయింపులు పెంచండి.
ఎపిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అధిక బడ్జెట్ కేటాయింపు అవసరం. 2025-26 బడ్జెట్ లో ఎపికి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరారు.
రాష్ట్రంలో పిఎం శ్రీ పథకం కింద ఏర్పాటైన పాఠశాలలు అద్భుతమైన పురోగతిని కలిగి ఉన్నాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు. వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పిఎం శ్రీ ఫేజ్ -1,2 లలో కలిపి ఎపిలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు గాను 855కు మాత్రమే మంజూరయ్యాయి. గతంలో సిఫార్సు చేసిన మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్ – 3 పిఎం శ్రీలో మంజూరు చేయండి.
ఎపిలో ఉన్నత విద్య అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద పెద్దఎత్తున సాయం అందించండి. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,229 కోట్లు, రాష్ట్రంలో 37 ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.555 కోట్లు, ఇప్పటికే పనిచేస్తున్న డిగ్రీ కళాశాలల్లో క్లాస్ రూమ్స్, ల్యాబరేటరీలు, లైబ్రరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.330 కోట్లు మంజూరు చేయండి. కర్నూలు అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలకు చెరో రూ.50కోట్లు, రాష్ట్రంలో 10 మహిళా కళాశాలల ఏర్పాటుకు రూ.150 కోట్లు, రెండు మోడల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు రూ.30కోట్లు, రూ. 250 కోట్లతో ఎఐ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించండి. 4 మేజర్ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ హబ్ లను ఏర్పాటు చేసేందుకు రూ.20కోట్ల చొప్పున 80కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు రూ.50కోట్లు, ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణానికి రూ.80కోట్లు, యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు రూ.180కోట్లు మంజూరు చేయండి. రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఎపిని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు.