తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహిస్తారు.
గజ వాహనం … బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
