కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం
– ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
కార్మికుల ఆరోగ్య పరిరక్షణ ముఖ్యం
– కమిషనర్ ఎన్. మౌర్య
తిరుపతి,
We will work for the welfare of workers
నగర పరిశుభ్రతకు అహర్నిశలు పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ సహకరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఇండోర్ స్టేడియంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు, పిపిఈ కిట్లను ఎమ్మెల్యే, కమిషనర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం పరిశుభ్రంగా ఉందంటే కారణం పారిశుద్ధ కార్మికుల నిరంతర కృషి అన్నారు. ఎవరూ చేయలేనటువంటి పనులను వారు మురుగు కాలువల్లో సైతం దిగి చేస్తున్నారని అన్నారు. అటువంటి వారే మనకు నిజమైన దేవుళ్ళతో సమానమని అన్నారు. వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రజలు చెత్త ఎక్కడబడితే అక్కడ పడేయకుండా మన ఇంటికి వచ్చిన నగర పాలక సంస్థ సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని అన్నారు.
కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగర పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమన్నారు. అందుకే వారికి రక్షణ కిట్లను, వారు అనారోగ్యం పాలు కాకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య పరీక్షల్లో పారిశుధ్య కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా వైద్య ఆరోగ్యాశాఖధికారి డాక్టర్ శ్రీహరి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.




