పవన్ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకున్న కౌలు రైతులు..
అమలాపురం సెప్టెంబర్ 2: అందరి హీరోలకు అభిమానులుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు.. ఓ వైపు సినిమాల్లో హీరోగా రాణిస్తూనే.. మరోవైపు జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. తన దైన శైలిలో ఇరు రంగాల్లో ముందుకు సాగుతున్నారు. వరస సినిమాలతో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. రాజకీయ పార్టీ అధినేతగా ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. అంతేకాదు తన సొంత సంపద నుంచి ఆపన్నులకు అండగా నిలుస్తూ భిన్నమైన రాజకీయ నేత అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలోని కౌలు రైతులకు అండగా నిలబడ్డారు. ఎంతో మంది అన్నదాత కుటుంబాలకు నేనున్నా అంటూ అండగా నిలిచారు. ఇంకా చెప్పాలంటే.. ఏపీలోని వివిధ జిల్లాలోని కౌలు రైతుల కోసం ముప్పై కోట్ల రూపాయలకు పైగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత డబ్బులను ఖర్చు చేసిన విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా కౌలు రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు ఆత్మహత్య చేసుకున్న ఒకొక్క కౌలు రైతుల కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం అందజేశారు.అయితే పవన్ కల్యాణ్ చేసిన సాయాన్ని తెనాలి రూరల్ మండలం అత్తోట గ్రామ వాసులు గుర్తు పెట్టుకున్నారు.

ఆయన సేవలకు గాను తమ అభిమానం తెలియజేసే విధంగా ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులు తమకు తెలిసిన సాగుని గుర్తు చేసుకుంటూ వరి పొలంలో జనసేన లోగోను వేశారు. దాదాపు ఇరవై రోజుల పాటు శ్రమించి వరి నారును లోగోగా నాటి పెంచారు. సరిగ్గా జనసేనాని పుట్టిన రోజు నాటికి వరి పైరు కొద్దీగా పెరిగి జనసేన పార్టీ లోగో స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ కోసం.. అత్తోట రైతులు ఆ న్నా స్లోగన్ కూడా జత చేశారు. ఈ స్లోగన్ ను వరి నారుతోనే రాశి తమ అభిమానాన్ని ప్రకటించారు రైతులు.ఇందుకోసం రెండు రకాల వరి వంగడాలను వాటినట్లు రైతులు తెలిపారు. కాలా బట్టీ, మైసూర్ మల్లిక వరి వంగడాలను వినయోగించామన్నారు. అయితే లోగోలో ఉన్న వరి పైరును పండించి, ధాన్యం వచ్చిన తర్వాత బియ్యాన్ని తీసి పవన్ కల్యాణ్ కు పంపించనున్నట్లు రైతులు తెలిపారు. సాధారణంగా ఈ రెండు రకాలు వరి నాట్లు నాటు విత్తనాలను ఉపయోగించారు. గత కొంతకాలంగా అత్తోట రైతులు నాటు వరి విత్తనాలనే సాగుకు వినియోగిస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురష్కరించుకొని రైతులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ లోగో స్థానిక రైతులను ఆకట్టుకుంది.



