భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత భారత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి వున్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని ఎం ఎస్ స్వామినాథన్ వినూత్న పద్దతుల్లో గుణాత్మక దశకు చేర్చారని సిఎం అన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎం ఎస్ స్వామినాధన్ కృషితోనే సాధ్యమైందని సిఎం కేసీఆర్ అన్నారు.దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై ఎం.ఎస్.స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో వారు చేసిన పరిశోధనలు సిఫారసులు దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని సిఎం అన్నారు.
దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భధ్రత దిశగా దార్శనికతతో జీవిత కాలం కృషి చేసిన మొట్టమొదటి వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ అని సిఎం అన్నారు. భిన్నమైన భౌగోళిక భూసార పరిస్థితులు కలిగి, దేశంలోని రాష్ట్రాల వారిగా ప్రజలు పండిస్తున్న పంటలపై వాటిని అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేసిన ఎం ఎస్ స్వామినాథన్ ప్రతి భారత రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతాడని సిఎం అన్నారు. తెలంగాణ లో వ్యవసాయ రంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఎం ఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడిన విషయాలను,తనతో వారికున్న అనుబంధాన్ని సిఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎంఎస్ స్వామినాథన్ రాష్ట్రానికి రావడం, వారితో తాను రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావడం మరిచిపోలేనని సిఎం అన్నారు. ఆ సందర్భంగా వారితో జరిగిన విస్తృత స్థాయి చర్చలో వారు చేసిన పలు సూచనలు అమూల్యమైనవని సిఎం తెలిపారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను వారు ఎంతగానో ప్రశంసించారని సిఎం గుర్తు చేసుకున్నారు. రైతు సంక్షేమం కోసం, సమ్మిళిత వ్యవసాయ రంగ సుస్థిరాభివృద్ధికోసం ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు వారి దార్శనికత వొక రైతు బిడ్డగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు.



