– ప్రభుత్వం ఏర్పాటులో తాత్సారం వద్దు
– ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక
హైదరాబాద్ బ్యూరో, డిసెంబర్ 05: తెలంగాణలో రాబోయే ఆరు నెలల్లో కేసీఆరే తిరిగి సీఎం అవుతారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని, ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయని పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రజాస్వామ్య, పౌర సంఘాల నాయకులు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించారనిదని వారు హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నిర్వహించిన మీడియా సమావేశంలో వేదిక వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, మామిడి సోమయ్య, కే కోటేశ్వరరావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, కరుణాకర్ దేశాయ్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ బీఎస్ రాములు, సాగరా బేగం, డాక్టర్ సోయబ్, షేక్ సత్తార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే పౌర సమాజం సహించదని, అదేవిధంగా ప్రజలు ఎంతో నమ్మక విశ్వాసంతో గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డదారులు తొక్కినా ప్రజాస్వామ్య, పౌర సంఘాలు ఊరుకోవని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు నియంత పాలనకు చరమగీతం పాడి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు విలువనిచ్చి సుపరిపాలన అందించాలని వారు కోరారు. ప్రభుత్వం చేపట్టేందుకు ప్రజలు అవకాశం ఇస్తే… కాంగ్రెస్ నాయకులేమో సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటూ తాత్సారం చేయడం సరైంది కాదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పౌర సంఘాల నాయకులు అంబు రాథోడ్, స్వరూప, జయంతి తదితరులు పాల్గొన్నారు.




