జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
CM Chandrababu Naidu’s key decision on Jubilee Hills by-election
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటికి దూరంగా ఉండాలని, ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.
అయితే, నిన్న(మంగళవారం) అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న(మంగళవారం) రాత్రి పొద్దుపోయేవరకూ తెలంగాణ తెలుగుదేశం నేతలతో ఈ సమావేశం కొనసాగింది. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య ఏపీలో పొత్తు ఉన్నందున…. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లలేమని నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు. బీజేపీ మద్దతు అడిగితే కలిసి పని చేయాలని.. లేదంటే తటస్థంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మాత్రం మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల అభిమానం ఉందని.. జనంలో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.



