Breaking News
Friday, July 26, 2024
Breaking News

గులాబీకి తెలుసుస్తొన్న నొప్పి

- Advertisement -

గులాబీకి తెలుసుస్తొన్న నొప్పి
హైదరాబాద్, ఏప్రిల్ 1 (వాయిస్ టుడే )
బీఆర్ఎస్ నేతలు వరస పెట్టి పార్టీని వీడి వెళుతున్నారు. కేవలం ఒక్కసారి ఓటమితో నాయకత్వంపై నమ్మకం లేదంటూ జెండాలు పక్కన పడేసి, తమకు ఇచ్చిన టిక్కెట్లు చించేసి మరీ కాంగ్రెస్ లోకి వెళుతున్నారు. మొన్ననే ఆ మధ్య పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన రోజు ఒక గేటు తెరిచామని, ఇక కాస్కో కేసీఆర్ అని బహిరంగంగానే రేవంత్ ఛాలెంజ్ విసిరారు. అందుకు అనుగుణంగానే పెద్దయెత్తున నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాము ఊహించని పేర్లు కూడా చేరికల జాబితాలో వినిపిస్తుండటంతో గులాబీ పార్టీ నేతలకు గూబ గుయ్యమనేలా అనిపిస్తుందట. 2014లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాల రాజకీయాలకు భిన్నంగా నడుపుతారనుకున్నారు. కానీ నాడు ఒక పార్టీ అంటూ లేదు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ… చివరకు కమ్యునిస్టులను కూడా కేసీఆర్ కాకా వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేలంతా తన దొడ్లోనే ఉండాలనుకునే మనస్తత్వానికి వచ్చేసిన కేసీఆర్ ఎవరినీ వదలకుండా అడ్డగోలుగా పార్టీలో చేర్చుకున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పార్టీలను ఏకంగా శాసనసభపక్షాలనే తమలో కలిపేసుకున్నది కూడా ఎవరూ మర్చిపోలేరు. 2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత చెలరేగిపోయారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి తన వైపు వస్తున్నారని పైకి చెబుతూ అందరినీ తన దారిలోకి తెచ్చుకున్నారు. ఫిరాయింపుల చట్టాన్ని తీసి పక్కన పడేశారు. సిట్టింగ్ స్థానమూ పాయె గొంతు చించుకున్నా…. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేటీఆర్, హరీశ్ రావు లాంటి వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ గత పదేళ్లలో కేసీఆర్ ఇదే పనిచేస్తున్నప్పుడు ఈ బాధ తెలియలేదా? అన్న ప్రశ్నలు వారికి సూటిగానే తగులుతున్నాయి. కేసీఆర్ ఫిరాయింపులను మొదలుపెడితే.. రేవంత్ రెడ్డి దానిని కంటిన్యూ చేస్తున్నాడంతే. అంతకు మించి ఆలోచించడానికి వేరే ఏమీ లేదు. అన్యాయం… అక్రమం అంటూ అరచి గగ్గోలు పెట్టినా ఉపయోగం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కు పెద్ద బొక్క పడింది. ఆ బొక్కలో నుంచి వెళ్లే నేతలను ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. అందులోనూ గత పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పనితీరుకు బేరీజు వేసుకుని వెళ్లేవాళ్లు అనేక మంది ఉన్నారు. ఎవరిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగే అవకాశమే లేనప్పుడు ఇలాంటి నైరాశ్యపు మాటలే హరీశ్‌రావు, కేటీఆర్ నుంచి వస్తాయిచివరకు లిక్కర్ స్కామ్‌లో ఇలా ఇరుక్కుపోయి నమ్మిన వాళ్లే…. రంజిత్ రెడ్డికి టిక్కెట్ ఇస్తామన్నా పోటీ చేయలేదు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినా వెళ్లిపోయి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కేకే ఫ్యామిలీతో సహా గేటు దాటేశారు. నమ్మకంగా ఉన్న కడియం కూడా గుడ్ బై చెప్పడానికి రెడీ అయిపోయారు. ఆయన కుమార్తె కావ్య అయితే వరంగల్ బీఆర్ఎస్ టిక్కెట్ నాకు వద్దంటూ చించి అవతల పడేసి కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. ఇలా ఇంకా ఎంతమంది వెళతారో తెలియదు. ఎవరు ఉంటారో తెలియదు. అలాగని ఎవరిపైనా నిఘా వేసే పరిస్థిితి కూడా ఇప్పుడు లేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు నేతలతో పాటు ప్రజలకు దగ్గరయితే కొంత వరకూ వలసలు తగ్గుతాయని భావించి రేపటి నుంచి పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎండిపోయిన పొలాలను పరిశీలించనున్నారు. కేసీఆర్ ఇలా బయటకు వచ్చి ప్రజల్లో ఉంటే వలసలు ఏమైనా ఆగుతాయా? అన్న చిన్న ఆశ ఆ పార్టీ నేతల్లో ఉంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!