- Advertisement -
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు.
వరంగల్ లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ.
– బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్





BRS silver jubilee celebrations to reflect the aspirations of the people of Telangana: KCR

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుండి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావొస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ గారు తెలిపారు.
ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం నాడు జరిగిన కీలక సమావేశంలో ఇందుకు సంబంధించి సుధీర్ఘ చర్చ జరిగింది.
ఈ సంధర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవ్వాళ కష్టాల్లో వుందన్నారు.
ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం వుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ.. ప్రజలు బీఆర్ఎస్ ను తెలంగాణ పార్టీగా తమ సొంత ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవ్వాళ అనేక కష్టాల్లో వున్నారు. వారి రక్షణ బీఆర్ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు అని తెలిపారు.
కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవ్వాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్బంగా వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది.
కాగా.. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ గారు తెలిపారు.
వరంగల్ బహిరంగ సభ అనంతరం.. పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత తెలిపారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంతో పాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిగింది.
గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలుపరచాలని సమావేశంలో నిర్ణయించారు.
కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా కూడా, తెలంగాణ సమాజానికి మొదటినుంచి అవి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో వుండాలని సమావేశం భావించింది.
తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్ధం చేయించి పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ప్రాతినిథ్యం వుండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
కాగా పలు అంశాలపై చర్చ సందర్బంగా అధినేత కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలను అధినేత ముందుంచారు.
దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుధీర్ఘ చర్చలో.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పి కొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది.



- Advertisement -