హైదరాబాద్, నవంబర్ 11, (వాయిస్ టుడే ): చంద్ర మోహన్… ఈ తరం ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కానీ, ఆయన కెరీర్ హీరోగా మొదలైంది. అయితే… ఆ తర్వాత సరైన, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో డబ్బు కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేక… క్యారెక్టర్ ఆరిస్టుగా మారి వరుస సినిమాలు చేశారు. ‘సిరిసిరి మువ్వ’ సినిమాతో మళ్ళీ హీరోగా బ్రేక్ వచ్చింది. ‘పదహారేళ్ళ వయసు’ సినిమాతో హీరోగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.చంద్రమోహన్ సరసన సుమారు 60 మంది హీరోయిన్లు నటించారు. అందులో చాలా మంది స్టార్ హీరోయిన్లు అయ్యారు. అప్పట్లో ‘చంద్ర మోహన్ పక్కన ఫస్ట్ సినిమా చేస్తే స్టార్ హీరోయిన్ కావడం గ్యారెంటీ’ అని పేరు వచ్చింది. ఒకటి రెండు సినిమాలు చేసి సక్సెస్ కాని హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో బిజీ కావడానికి చంద్ర మోహన్ సరసన యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. బాలనటిగా పలు సినిమాలు చేసిన శ్రీదేవి… ‘పదహారేళ్ళ వయసు’తో కథానాయికగా మారారు. అందులో చంద్ర మోహన్ హీరో. ఆ తర్వాత శ్రీదేవి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కథానాయికగా జయప్రద తొలి సినిమా ‘సిరిసిరి మువ్వ’లో కూడా ఆయనే హీరో. జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ… ఇలా ఎంత మందికో తొలి హీరో చంద్ర మోహన్. వాళ్ళ ప్రతిభ వల్ల ఆయా హీరోయిన్లు ఉన్నత స్థానానికి చేరుకున్నారు తప్ప… అందులో తన ప్రమేయం ఏమీ లేదని రెండు మూడు సందర్భాల్లో చంద్ర మోహన్ చెప్పారు. అయితే… ఆయన పక్కన నటిస్తే టాప్ హీరోయిన్ పొజిషన్ గ్యారంటీ అనే సెంటిమెంట్ మాత్రం అప్పట్లో బలంగా ఉండేది. చంద్ర మోహన్ సరసన ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరంటే? సహజ నటి జయసుధ పేరు చెప్పాలి. వాళ్లిద్దరూ 34 చిత్రాల్లో జంటగా నటించారు. లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయ శాంతి… ఈ హీరోయిన్లతో కూడా ఆయన పది, పదిహేను సినిమాలు చేశారు.

శ్రీదేవితో మళ్ళీ చేయడం కుదరలేదు!
చంద్ర మోహన్ సరసన ‘పదహారేళ్ళ వయసు’ సినిమాతో శ్రీదేవి కథానాయికగా పరిచయం అయినప్పటికీ… అంతకు ముందు బాలనటిగా ఆయనతో సినిమాలు చేశారు. ‘యశోదా కృష్ణ’ సినిమా చేసేటప్పుడు… చిత్రీకరణ పూర్తి చేసుకుని చెన్నై వెళ్ళేటప్పుడు శ్రీదేవి తన ఒడిలో నిద్రపోయేదని చంద్ర మోహన్ ఒకానొక సమయంలో గుర్తు చేసుకున్నారు. తన సరసన కథానాయికగా చేసినా… ఆ తర్వాత హైట్ పెరగడంతో తనతో మళ్ళీ హీరోగా సినిమా చేయడం కుదరలేదని ఆయన పేర్కొన్నారు. ‘మీ పక్కన మళ్లీ ఎప్పుడు కథానాయికగా చేస్తాను?’ అని చంద్ర మోహన్ ని శ్రీదేవి అడిగేవారట
ఆయన మృతి తీరని లోటు
సీనియర్ కథానాయకులు, నటులు చంద్ర మోహన్ మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు సినిమా ప్రముఖులు చంద్ర మోహన్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తెలుగు ప్రేక్షకుల మనసులో ముద్ర వేసిన నటుడు : చిరంజీవి
నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు : బాలకృష్ణ
చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలి : వెంకటేశ్, పవన్ కళ్యాణ్
పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది : కె రాఘవేంద్రరావు
చంద్రమోహన్ అకాల మరణం చాలా బాధాకరం : ఎన్టీఆర్



