బల్లులు తిరిగే బాత్రూంలో 16 రోజులు టార్చర్ అనుభవించా.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఎమోషనల్
హైదరాబాద్
CM Revanth emotional in the assembly
తెలంగాణ అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదని అన్నారు. తనది అలాంటి స్వభావమే అయితే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. గతంలో తనను ఎంతో ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. 16 రోజుల పాటు జైలులో పెట్టారు. బల్లులు తిరిగే బాత్రూంలో బంధించారు. కూతురి పెళ్లికి కూడా రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చారని ఎమోషనల్ అయ్యారు. సొంత పార్టీ ఆఫీస్లో, సొంత పార్టీ నేతలతోనూ తనను తిట్టించారని అన్నారు. రివేంజ్ తీసుకోవాలనుకుంటే ఎంతో సమయం పట్టదని.. వాటి మీద నేను దృష్టి పెట్టుంటే ఇవాళ వాళ్లంతా జైలులో ఉండేవారని అన్నారు. నన్ను వేధించిన వారిని ఆ దేవుడే ఆస్పత్రి పాలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తాము అలా చేయడం లేదు.. అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు అంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతుభరోసా ఇచ్చాం, రుణమాఫీ చేశాం, 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం… ఇలా చెప్పుకుంటే పోతే ఏడాదిన్నలోనే అనేక పనులు చేశామని అన్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరి దోచుకో.. దాచుకో అనేది తమ సిద్ధాంతం కాదని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని రైతులను కేసీఆర్ అనేక రకాలుగా వేధించారు.. ఆయన ఫామ్ హౌజ్లో మాత్రం వరి పండించారని అన్నారు..


