గేమ్ ఛేంజర్ గా మహాలక్ష్మీ పథకం
హైదరాబాద్, మార్చి 12
Mahalaxmi Scheme as a Game Changer
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, అన్ని వర్గాల కలల సాకారానికే బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం అన్నారు. రైతులు, మహిళలు, యువత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆరు గ్యారంటీ అమలు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఓ ప్రాంతం మాత్రమే కాదు, ఘనమైన సంస్కృతికి నిలయం అని కొనియాడారు.తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతుంది. వరి రైతులకు మేం రూ. 500 బోనస్ ఇస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం’ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారికంగా విశిష్ట గుర్తింపు ఇచ్చాం. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు లబ్ధి చేకూర్చేలా రూ.2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేసింది. ఎకరాకు రూ.12 వేలు రైతులకు పంట ఆర్థిక సాయం అందించాం. కృష్ణా జలాలలో న్యాయపరంగా తెలంగాణ వాటా దక్కించుకునేందుకు కృష్ణా జలాల ట్రిబ్యునల్ 2 సమక్షంలో వాదనలు వినిపించారు. మహాలక్ష్మీ పథకం గేమ్ ఛేంజర్ గా మారింది. మహిళలకు 149.63 లక్షల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పించి.. వారికి ప్రయాణం ద్వారా రూ.5005 కోట్లు ఆదా చేసింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా మహిళలకు లక్ష కోట్ల ఆర్థిక సహాయం అందించి మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్న గవర్నర్, రాష్ట్రానికి రైతులే ఆత్మగా వర్ణించారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఉందన్నారు. దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న తెలంగాణ అని చెబుతూ అన్నదాతలకు రుణమాఫీ చేశామన్నారు. దాదాపు 23.35 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం కల్పించామని, మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
పాడి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, యువత ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్యూచర్ సిటీ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని వివరించారు. శ్రీశైలం – సాగర్ హైవే మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దీనికి కేటాయించామన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని, మెట్రో రైలు సౌకర్యం కూడా రాబోతుందని తెలిపారు గవర్నర్.రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్న గవర్నర్, ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అలాగే పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. రుణమాఫీ కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశామని, రూ. 500కే గ్యాస్ అందజేస్తున్నట్లు తెలిపారు.ఇక ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్న గవర్నర్, బీసీల రిజర్వేషన్ల కోసం కుల గణనను నిర్వహించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, దీని ఆధారంగా ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం టీజీపీఎస్సీని బలోపేతం చేశామని తన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యా రంగాన్ని కీలక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతోందన్నారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగం సాగింది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలను గురువారం నాటికి వాయిదా పడ్డాయి.గురువారం సభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. శుక్రవారం హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు. 15న ధన్యవాద తీర్మానంపై చర్చ కంటిన్యూ కానుంది. 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ జరగనుంది. అలాగే 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ నిర్వహించనున్నారు. 19న వార్షిక బడ్జెట్ను ప్రవెశ పెట్టనున్న ప్రభుత్వం. 21న బడ్జెట్పై చర్చ జరగనుంది. ఈనెల 29 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.