అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే చర్చ మొదలు కాగా… బీజేపీ కౌంటర్లతో విరుచుకు పడుతోంది. ట్విటర్ వేదికగా ఓ సెటైరికల్ పోస్ట్తో రాహుల్పై విమర్శలు చేసింది. ఓ కార్టూన్తో కౌంటర్ ఇచ్చింది. అందులో రాహుల్ గాంధీ ప్లేన్ నడుపుతున్నారు. “Ticket to Disaster” అని క్యాప్షన్ ఇచ్చింది బీజేపీ. ఇప్పటికే రాహుల్ గాంధీపై విమర్శల డోస్ పెంచిన కాషాయ పార్టీ…అవకాశం దొరికిన ప్రతిసారీ గట్టిగానే స్పందిస్తోంది. రాహుల్ పదేపదే ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం బీజేపీని అసహనానికి గురి చేస్తోంది. ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పీచ్ కూడా హైలైట్ అయింది. దానికి ప్రధాని మోదీ ఇచ్చిన కౌంటర్లు కూడా బాగానే పేలాయి. అప్పటి నుంచి రాహుల్ వర్సెస్ మోదీ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా గహ్లోట్ ప్రకటించడంపై బీజేపీ ఇలా స్పందిస్తోంది. కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ నిలబడతారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

అయితే… చాలా సందర్భాల్లో పలువురు నేతలు దీన్ని కొట్టిపారేశారు. రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకోడం లేదని తేల్చి చెప్పారు. కానీ.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. I.N.D.I.A కూటమి గురించి ప్రస్తావిస్తూ 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ రేసులో ఉంటారని తేల్చి చెప్పారు. ఎన్నో చర్చల తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగానే విపక్షాలన్నీ కలిసి కూటమి కట్టాల్సి వచ్చిందని, ఇది ప్రజలు కోరుకున్నదే అని అన్నారు గహ్లోట్. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరినీ ఖండించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చాలా గర్వంగా కనిపిస్తున్నారని, కేవలం 31%ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మిగతా 69% మంది మోదీ సర్కార్కి వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో గత నెల విపక్షాలు భేటీ అవడం చూసి NDA భయపడిపోయిందని సెటైర్లు వేశారు. 50% ఓట్లు రాబట్టుకునేందుకు NDA కృషి చేస్తోందన్న అంశంపైనా స్పందించారు. “ప్రధాని నరేంద్ర మోదీ 50% ఓట్లు సాధించడం ఎప్పటికీ జరగదు. ఆయన చరిష్మా ఎక్కువగా ఉన్నప్పుడే ఇది సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికల్లో అయితే ఎలాగో అది జరగదు. ఆయన ఓటు షేర్ కచ్చితంగా తగ్గుతుంది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చాకే అదే అర్థమవుతుంది. ఆ ఎన్నికలే తదుపరి దేశ ప్రధాని ఎవరన్నది డిసైడ్ చేస్తుంది.”



