నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం
హాల్ టికెట్ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఉచిత రాకపోకలు
సకాలంలో చేరేందుకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు: నాగిరెడ్డి
Free bus travel for NEET re-exam candidates by TGSRTC.
హైదరాబాద్, జూన్ 19: ఈ నెల 21న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ (NEET) రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి, తిరిగి పరీక్ష అనంతరం ఇంటికి ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు.
ఈ ప్రత్యేక సౌకర్యం ఏసీ సర్వీసులు మినహా టీజీఎస్ ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాల్లో అదనపు బస్సులను నడిపేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
జూన్ 21న తొలి బస్సు సర్వీసు నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ముందస్తుగా ప్రయాణ ప్రణాళిక రూపొందించుకుని ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.
ప్రయాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-2345 0033, 6815 3333లను సంప్రదించాలని తెలిపారు.
నీట్ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులందరికీ టీజీఎస్ ఆర్టీసీ తరఫున వై. నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.




