సంగారెడ్డి జిల్లాలో పెళ్లింట ఓ రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. నిన్న రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగి బంధువులు మరణించడంతో పెళ్లి ఆగిపోయింది.
దీంతో మనస్తాపానికి గురైన వరుడి తాత నేడు ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. తెల్లవారితే పెళ్లి.. సంతోషంగా పెళ్లి కూమార్తెను తీసుకువచ్చేందుకు వరుడి తరఫు బంధువులంతా కలిసి ట్రాక్టర్లో వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా, మరో 22 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆందోల్ మండలం మాన్సాన్ పల్లిలో నిన్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నిన్న ముగ్గురు మృతి చెందారు
బంధువులు ప్రమాదంలో చనిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో వరుడి తాత పెంటయ్య తీవ్ర మనస్థాపానికి గురై నేడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రాములుకు సంగారెడ్డి జిల్లా అందోలు పట్టణానికి చెందిన పూజారి యాదయ్య కుమార్తెతో గురువారం వివాహం జరగనుంది. పెళ్లి తంతులో భాగంగా పతానం కార్యక్రమం జరిపి వధువును తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు వరుడి బంధువులు 29 మంది ట్రాక్టర్లో వధువు ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో.. అందోలు మండలం మన్సాన్పల్లి శివారులోని మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి ట్రాలీ బోల్తా పడింది.
ఈ దుర్ఘటనలో బాచారం గ్రామానికి చెందిన జుట్టుగారి సంగమ్మ (45), రావగారి బూదెమ్మ(52), ఆగమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాలీలోని మిగతా 22 మందికి గాయాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమాచారం అందగానే ఎస్సై అరుణ్గౌడ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జోగిపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా పెళ్లి ఆగిపోయింది. దీంతో వరుడి తాత ఆత్మహత్యకు పాల్పడటం ఆ కుటుంబాన్ని మరింత కలచివేస్తోంది.