6న ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ప్రారంభం
హైదరాబాద్, అక్టోబరు 4: తెలంగాణలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈనెల 6వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం తీసుకొస్తున్నారు. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో, సంబంధిత కార్యదర్శులతో, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు.ప్రతి నియోజకవర్గంలో నుంచి ఒక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఎంపిక చేసి అల్పాహార ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. విద్యార్థులకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సంపూర్ణ అల్పాహారాన్ని అందించాలని ఇటీవలే నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రతీ సంవత్సరం 400 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం.
![Another new scheme in Telangana](https://voicetodaynews.com/wp-content/uploads/2023/10/stalin.jpg)
ఈ పథకం అమలు సాధ్య సాధనలకై రాష్ట్ర ఉన్నతాధికారులు తమిళనాడులో పర్యటించారు. అక్కడ అమలు అవుతున్న అల్పాహార పథకం విధివిధానాలను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదికను సమర్పించారు. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే ఈ పథకం అమలు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి అమలు చేయాలని నిర్ణయించింది.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం అమలు చేయనున్నారు. జిల్లాలో చాలామంది పేద పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం ఖాళీ కడుపుతో బడులకు వస్తున్నారు. నీరసం, రక్తహీనత, పోషకాహార లోపం సమస్యలు విద్యార్థులను బాధిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం గుర్తించి ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచటం, కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యుహాంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెడుతుంది. సన్నబియ్యం, రాగిజావ, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు/అరటి పండు వంటివి అందించబోతున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో స్నాక్స్ను అందజేస్తుండగా, తాజాగా సుపోషణలో భాగంగా బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయనున్నది
![Another new scheme in Telangana](https://voicetodaynews.com/wp-content/uploads/2023/10/stalin2.jpg)