హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు నల్లకుంటలోని శంకర్మఠ్ సమీపం నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు జరిగిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ‘శ్రమదానం’ చేసారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి.. మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం పేరుతో దేశవ్యాప్తంగా.. బీజేపీ పార్టీ తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున, స్వచ్ఛంద సేవాసంస్థల తరపున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వారిచ్చిన స్వచ్ఛభారత్ స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చిన గాంధీజీ.. స్వాతంత్ర్య భారతదేశానికంటే ముందే.. స్వచ్ఛభారత్ సాధించాలని పిలుపునిచ్చారు.
![Kishan Reddy's call for Swachh Bharat](https://voicetodaynews.com/wp-content/uploads/2023/10/kishan1a.jpg)
అదే స్ఫూర్తితో మోదీ, ఆయన అధికారం చేపట్టినప్పటినుంచి నేటి వరకు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంగా కోట్లాదిమంది ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఈ శ్రమదానంలో పాల్గొంటున్నారు. నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని ప్రజాకార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. పాఠశాలలో చదువుకునే చిన్నారిని అడిగినా.. స్వచ్ఛభారత్ కార్యక్రమం అంటే ఏంటో చెప్పేలా అందరిలో.. చైతన్యాన్ని నింపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పారిశుద్ధ్యత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో మన భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తాం. స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యం లేకుండా పూర్తికాదు. అందుకే ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి. స్వచ్ఛభారత్ నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.