Breaking News
Saturday, July 27, 2024
Breaking News

ద్వితియశ్రేణులు… కిం కర్తవ్యం

- Advertisement -

ద్వితియశ్రేణులు… కిం కర్తవ్యం
హైదరాబాద్, జూన్ 11
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ప్రస్తుతం కష్టకాలం దాపురించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి దిగజారారు. దాదాపు ఎనిమిది లోక్ సభ సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పదేళ్లు ఏకచ్ఛత్రాధిపత్యంతో తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు ప్రజలలో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని సొంత పార్టీ నేతలే తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రాంతీయ సమస్యలను నెత్తికెత్తుకుని సెంటిమెంట్ గా తెలంగాణలో పదేళ్ల అధికారం దక్కించుకుందో అదే సెంటిమెంట్ పులిమీద స్వారీలా తయారయింది. ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళదామనే కేసీఆర్ ఆలోచనే ఆ పార్టీ పతనానికి నాంది అయింది. టీఆర్ఎస్ గా ఉన్నంతకాలం ఆ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ గా మార్చేసరికి ఆ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది అని రాజకీయ పండితులు చెబుతున్న మాట.లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆధిక్యతలను చూస్తే.. కాంగ్రెస్ పార్టీ తన స్థానాలు కొన్ని మారినా మొత్తంగా 64 సీట్లలో ఆధిక్యాన్ని చూపించుకుంది. బీజేపీ ఏకంగా 58 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యాన్నిచూపించింది. మజ్లిస్ పార్టీ తన ఏడు సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని నిలుపుకుంది. నాంపల్లిలో మాత్రం.. వెనుకబడింది. అక్కడ కాంగ్రెస్ ది ఆధిపత్యం అయింది. బీఆర్ఎస్ కు మాత్రం మూడు సెగ్మెంట్లలోనే ఆధిక్యం వచ్చింది.నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39సీట్లను సాధించుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షంతో కలిసి అరవై ఐదు గోల్చుకోగా.. బీజేపీ ఎనిమిది దగ్గర ఆగిపోయింది. ఇదంతా బీఆర్ఎస్ నేత అనాలోచిత చర్య వలనే చేజేతులారా పార్టీని పాతాళానికి నెట్టినట్లయిందని అంటున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీజేపీకి త్యాగం చేయడం వలనే ఈ పరిస్థితి దాపురించింది. నేనే బీఆర్ఎస్ లీడర్ ని అయితే భవిష్యత్ పై ఖచ్చితంగా ఆందోళన చెందుతానని ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. పరోక్షంగా బీజేపీని బలోపేతం చేయడానికే కేసీఆర్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకోసం తన బిడ్డ లాంటి ప్రాంతీయ పార్టీని బలిపశువును చేయడానికి కేసీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కనీసం గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టకుండా ఓడిపోతారని ముందే తెలిసిన నేతలను బీజేపీ బలంగా ఉన్న చోట్ల నిలబెట్టడం చూస్తే ఆ పార్టీ భవిష్యత్తులో బీజేపీతో అంటకాగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఏ పార్టీలోకి వెళితే తమ భవిష్యత్తు బాగుంటుందా అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ను కూడా ప్రాంతీయ పార్టీ అనడానికి వీలులేకుండా కేసీఆర్ మార్చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కేవలం జాతీయ పార్టీలే. అందునా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రోజురోజుకూ బలపడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో మోదీకి ముచ్చెమటలు పట్టించే పరిస్థితికి తెచ్చింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ సైతం కూటమిలో హీరోగా ఎదుగుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో దాదాపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే దిశగా రాహుల్ గాంధీ ఎదుగుతున్నారు. ఇక ప్రతిపక్ష నేతగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రజా నేత పాత్ర వహించబోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి వేరే పార్టీలోకి వెళదామనుకునే నేతలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారంబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ సున్నా స్థితికి వచ్చింది. బీజేపీ కూడా మెల్లిగా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది. ఈ పార్టీలతో పోల్చుకుంటే రైజింగ్ స్థితిలో ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీయే అని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో అయోధ్యలోనే బీజేపీ ఓడిపోవడం, మతాన్ని నమ్ముకుని ఉత్తర ప్రదేశ్ లో చేసిన బీజేపీ ప్రచారం బెడిసికొట్టడంతో బీజేపీ అగ్ర నేతలే ఆలోచనలో పడ్డారు. అలాగే వారణాసిలో 2019లో ఐదు లక్షలకు పైగా మెజార్టీ వచ్చిన మోదీకి ఈసారి లక్షకు పైగా మాత్రమే రావడం చూస్తుంటే ఇవన్నీ బీజేపీకి వ్యతిరేకతాంశాలే. బీఆర్ఎస్‌కు పోటీగా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఓడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ రెండు జాతీయ పార్టీలతో పోరాడటం అంటే.. కేసీఆర్ కు..బీఆర్ఎస్‌కు అంత తేలిక కాదు. అందుకే భిన్నమైన రాజకీయం చేయబోయి నలిగిపోయారు. బీజేపీ లక్ష్యం ప్రాంతీయపార్టీల్ని అమాంతం మింగేయడం. తెలంగాణలో అలాంటి చాన్స్ ఉందని మోదీ, షాలకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఎలా వ్యవహరించాలో వారికి బాగా తెలుసు. ఈ రాజకీయాల్లో వారు మాస్టర్లు. అందుకే బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించారు. రాష్ట్రంలో రెండే పార్టీలు ఉంటే ఏమీ చేయకపోయినా అధికారపార్టీపై కోపంతో ప్రతిపక్షంకి ఓట్లేస్తారు. కానీ మూడు పార్టీలు ఉంటే ప్రజలకు ప్రత్యామ్నాయం ఉన్నట్లే. బీఆర్ఎస్‌ ఈ లాజిక్ ను అర్థం చేసుకుని కష్టపడాల్సి ఉంది. ఇందు కోసం కేసీఆర్ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో క్యాడర్ కు సైతం ఆర్థం కావడం లేదు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!