బాలీవుడ్ నటి యామీ గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మంగళవారం జమ్మూ పర్యటనకు వెళ్లిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. అలాగే మౌలానా ఆజాద్ స్టేడియంలో నిర్వహించిన సభలోనూ ప్రసంగించారు.
‘ఆర్టికల్ 370 పై ఈ వారంలో ఒక సినిమా విడుదల కానుందని విన్నాను. అది మంచి విషయం. ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ చిత్రం ఉపకరించనుంది. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధానమైన అవరోధంగా ఉండేది. దానిని భాజపా తొలగించడంతో ఇప్పుడు ఈ ప్రాంతం సమతుల్యత దిశగా కదులుతోంది. దాని రద్దు తర్వాతే ఇక్కడి ప్రజలు రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయాన్ని పొందుతున్నారు’ అని మోదీ అన్నారు. అలాగే వారసత్వ రాజకీయాలపైనా విమర్శలు చేశారు.
‘దశాబ్దాల తరబడి వంశపారంపర్య రాజకీయాల భారాన్ని జమ్మూకశ్మీర్ భరించాల్సి వచ్చింది. ఆ రాజకీయ నేతలు వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన భారత్ అంటే అభివృద్ధి చెందిన జమ్మూకశ్మీర్ కూడా అని తెలిపారు. గత పదేళ్లలో ఈ ప్రాంతంలో కొత్తగా 50 డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. అప్పట్లో పాఠశాలలకు నిప్పంటించేవారని, ఇప్పుడు అలంకరిస్తున్నారని అన్నారు.
‘ఆర్టికల్ 370’ సినిమా విషయానికొస్తే.. ఆదిత్య సుహాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే దీని టీజర్కు మంచి స్పందన రాగా.. తాజాగా ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్గా యాక్షన్ అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకోనుంది యామీ. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కానుంది
ఆర్టికల్ 370 … మోడీ ప్రసంగం లో యామి గౌతమ్ సినిమా ప్రస్తావన
- Advertisement -