Breaking News
Saturday, July 27, 2024
Breaking News

గజ్వేల్​ నుంచే కేసీఆర్ పోటీ!..

- Advertisement -

14 మంది మంత్రులకు సిట్టింగ్ స్థానాలు ఖరారు..

బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థులపై నేడు ఉత్కంఠ వీడనుంది. శ్రావణ సోమవారాన్ని మంచిరోజుగా భావిస్తున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 105 మంది పేర్లను ఒకేసారి ప్రకటించిన గులాబీ దళపతి.. ఈసారి కొన్ని మినహా దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఒకేసారి వెల్లడించే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ప్రాధాన్యమిస్తూ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులతో పాటు కాంగ్రెస్, తెదేపాల నుంచి చేరిన ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్ ఖాయమైనట్లు సమాచారం. సుమారు 10 చోట్ల కొత్త ముఖాలు కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. పోటీ తీవ్రంగా ఉన్నందున అసంతృప్తి, అసమ్మతి తలెత్తినా.. మూడు నెలల్లో చక్కదిద్దవచ్చని అధిష్ఠానం ధీమాతో ఉంది. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను తేల్చేలోగా.. ఒకటి, రెండు విడతల ప్రచారం పూర్తి చేసేలా గులాబీ పార్టీ వ్యూహం రూపొందించింది.

శాసనసభ ఎన్నికలకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌.. నేడు అభ్యర్థులను ప్రకటించనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఈసారీ అదే తరహాలో దాదాపు అన్ని స్థానాలు లేదా.. కనీసం 100కు పైగాచోట్ల అభ్యర్థులను వెల్లడిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశమివ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్థుల ఖరారు కోసం బీఆర్‌ఎస్ నాయకత్వం.. కొన్ని నెలలుగా అనేక సర్వేలు చేయించింది. ఆ సర్వేల ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలను పిలిచి.. పని తీరు మార్చుకోవాలని కేసీఆర్, కేటీఆర్ హెచ్చరించారు.

అయితే తీరు మార్చుకోని నేతలు.. తరచుగా వివాదాస్పదంగా మారిన కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. దాదాపు 10 స్థానాల్లో కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆసిఫాబాద్‌లో కోవాలక్ష్మికి టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలని.. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఖానాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బదులు.. భూక్యా జాన్సన్ నాయక్‌కు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్ స్థానంలో అనిల్ జాదవ్ లేదా నగేశ్‌లకు అవకాశం ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వేములవాడలో పౌరసత్వం వివాదం ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బదులుగా రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన.. చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్య బదులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బదులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తారని.. పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ బదులు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు ఇవ్వాలని భావిస్తున్నారు. దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి (MP Kotha Prabhakar Reddy)ని పోటీకి దించాలని బీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న మరణించినందున ఆయన కుమార్తె లాస్య నందితవైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గోషామహల్ నుంచి గత ఎన్నికల్లో ప్రేం సింగ్ రాథోడ్ పోటీ చేయగా.. ఈసారి నియోజకవర్గం ఇంఛార్జీ నందకిషోర్ వ్యాస్‌కు అవకాశమిచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

మహమూద్‌ అలీ, సత్యవతి రాఠోడ్ మినహా మంత్రులందరికీ..

మంత్రివర్గంలోని మహమూద్‌ అలీ, సత్యవతి రాఠోడ్ మినహా మిగతా మంత్రులందరికీ మళ్లీ టికెట్లు ఖాయమయ్యాయి. గత ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లో విలీనమైన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు అందరికీ మరోసారి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కడియం శ్రీహరి (MLC Kadiyam Srihari) కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కేటీఆర్ అమెరికా వెళ్లినందున.. హరీశ్‌రావు, కవితను కలిసి టికెట్ కోరేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు.

సూర్యాపేట పర్యటనకు వెళ్లే ముందు.. తిరిగొచ్చాక కేసీఆర్ పలువురు ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థులపై తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తవచ్చని మంత్రి హరీశ్‌రావు సహా తదితరులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నందునే.. 3 నెలల ముందే టికెట్లుప్రకటించేలా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చాలాచోట్ల అసంతృప్తి, అసమ్మతి భగ్గుమంటుందని పార్టీ వర్గాలు ముందే అంచనా వేశాయి. అసంతృప్తులను పిలిచి మాట్లాడే బాధ్యత ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలకు అప్పగించాలని నిర్ణయించారు.

అవసరమైనచోట హరీశ్‌రావు, కేసీఆర్ మాట్లాడాలని భావిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలను ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముందే పిలిపించి మాట్లాడి పరిస్థితి వివరించి భవిష్యత్‌పై హామీ ఇచ్చారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అవకాశం ఇవ్వని సిట్టింగ్‌లకు భవిష్యత్తులో ఎమ్మెల్సీలుగా పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం. వీలైనంత వరకు నేతలెవరూ పార్టీ వీడకుండా నచ్చచెప్పే యోచనలో ఉన్న అధిష్ఠానం.. ఒకవేళ వినకపోతే వదిలేయాలని.. అయితే అలాంటి వారి వెంట ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది.

వారందరికీ నచ్చజెప్పిన తర్వాతే ప్రచారం స్టార్ట్..:

అసంతృప్తులు, అసమ్మతులకు నచ్చచెప్పిన తర్వాత ప్రచారం ప్రారంభించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. రానున్న 3 నెలల్లో ప్రతి ఓటరును అభ్యర్థులు కనీసం నాలుగు నుంచి ఐదుసార్లు వ్యక్తిగతంగా కలిసేలా ప్రచార వ్యూహాలు రూపొందిస్తోంది. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోగా.. అభ్యర్థులు ప్రతి ఇంటికి కనీసం రెండుసార్లు వెళ్లాలనేది పార్టీ వ్యూహం.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!