హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ పరేడ్ మైదానంలో ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా 2 నిమిషాల 33 సెకన్ల నిడివి గల గీతాన్ని ప్రదర్శించారు. ప్రదర్శన సమయంలో గీత రచయిత అందెశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్ల నుంచి ఆనందబాష్పాలు జాలువారాయి. గీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ఆయన పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ.. జై తెలంగాణ అంటూ నినదించారు. గీతానికి స్వరాలు సమకూర్చిన ఎం.ఎం.కీరవాణి సైతం భావోద్వేగానికి గురయ్యారు.
గీతం ఇలా..
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ.. జై జై తెలంగాణ
జై తెలంగాణ.. జై జై తెలంగాణ
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మా నీవే మా ప్రాణం
జై తెలంగాణ.. జై జై తెలంగాణ
జై తెలంగాణ.. జై జై తెలంగాణ
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలే
జై తెలంగాణ.. జై జై తెలంగాణ
జై తెలంగాణ.. జై జై తెలంగాణ
జై తెలంగాణ.. జై జై తెలంగాణ
జై తెలంగాణ.. జై జై తెలంగాణ